
తెలుగు ప్రేక్షకుల కోసం బూతులు తగ్గించారుట!
దగ్గుబాటి రానాకు టాలీవుడ్ ఆడియన్స్ పల్స్ అర్థమైపోయింది. నిన్న జరిగిన "రానా నాయుడు 2" టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఫస్ట్ సీజన్ ని ప్రపంచమంతా చూసినా, తెలుగు జనాలు మాత్రం ఆదరించలేదని, అందుకే ఈసారి బూతులు తగ్గించి వయొలెన్స్ పెంచామని, ఖచ్చితంగా ఆదరణ దక్కించుకుంటుందన్న నమ్మకం వ్యక్తం చేశాడు. నిజానికి రానా నాయుడు మీద అంత క్రిటిసిజం రావడానికి కారణం బోల్డ్ కంటెంట్ ఒకటే కారణం కాదు. విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ మోస్ట్ ఫ్యామిలీ హీరోతో డబుల్ మీనింగ్ కంటెంట్ చేయించడాన్ని మన పబ్లిక్ అంగీకరించలేకపోయారు.
అందుకే సీక్వెల్ లో ద్వందార్థాలు ఎక్కువగా లేకుండా చూసుకుంటామని వెంకటేష్ కూడా గతంలో పలు ప్రెస్ మీట్ల లో హామీ ఇచ్చారు. నిన్న వదిలిన టీజర్ లో యాక్షన్ విజువల్స్ డామినేషన్ ఉండటం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈసారి వెంకీ, రానాతో పాటు అర్జున్ రామ్ పాల్ కూడా గ్యాంగ్ లో తోడయ్యాడు. వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే డ్రామానే రానా నాయుడు 2.
నెట్ ఫ్లిక్స్ ఈసారి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నిన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రత్యేకంగా ఈవెంట్ చేయడం ద్వారా తొలి సంకేతం ఇచ్చింది. జూన్ 13న స్ట్రీమింగ్ డేట్ వచ్చే దాకా నాన్ స్టాప్ పబ్లిసిటీ చేయనుంది.
సంక్రాంతికి వస్తున్నాం తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఇమేజ్ ఈసారి రానా నాయుడు 2 కి బాగా ఉపయోగపడనుంది. కాకపోతే బూతులు లేవనే హామీని ట్రైలర్ తదితర ప్రమోషన్ మెటీరియల్స్ లో చూపించాల్సి ఉంటుంది. టాలీవుడ్ లో పెద్ద మార్కెట్ ఉన్న స్టార్ హీరోలు వెబ్ సిరీస్ చేయడం రానా నాయుడుతోనే మొదలయ్యింది. ఆ తర్వాత మావయ్య రూటుని ఫాలో అవుతూ నాగ చైతన్య అమెజాన్ ప్రైమ్ కోసం దూత చేశాడు. కరణ్ అంశుమాన్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు బడ్జెట్ కూడా భారీగా అయ్యిందట. వచ్చే వారం నుంచి వెంకటేష్ స్వయంగా ప్రమోషన్లలో భాగం కాబోతున్నారని సమాచారం.