
పవన్ VS బాలయ్య..ఎలా సాధ్యం?
విడుదల తేదీ విషయంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశాలున్నాయని డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మొదలైన ప్రచారం అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళ్తే అఖండ 2 (తాండవం)ని సెప్టెంబర్ 25 రిలీజని షూటింగ్ ప్రారంభంలోనే ప్రకటించుకున్నారు. అయితే అప్పటికంతా షూట్ అవ్వకపోవచ్చని, 2026 సంక్రాంతికి రావొచ్చనే ప్రచారం మధ్యలో జరిగింది. కానీ దర్శకుడు బోయపాటి శీను జెట్ స్పీడ్ తో చిత్రీకరణ జరుపుతూ క్లైమాక్స్ తో సహా కీలక భాగాలన్నీ జార్జియాలో జరుగుతున్న షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలిసింది. తర్వాత పాటల సంగతి చూస్తారు.
సో దసరా పండక్కు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇంకో వైపు ఓజి ని సెప్టెంబర్ 26 న తీసుకొస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన నిర్మాత డివివి దానయ్య బయ్యర్ల దగ్గర ఉంచారట. తొలుత సెప్టెంబర్ 5 అనుకున్నప్పటికీ అది హాలిడే సీజన్ కాదు కాబట్టి ఫెస్టివల్ హాలిడేస్ కలిసొచ్చే 26నే సీరియస్ గా పరిశీలిస్తున్నారట. అయితే అఖండ 2 రాకపోతేనే ఇది లాక్ చేయొచ్చు. ఎందుకంటే రాజకీయంగా, వ్యక్తిగతంగా పవన్, బాలయ్యల మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ థియేటర్లలో కలబడి ఒకరి ఓపెనింగ్స్ మరొకరు దెబ్బ పడాలని కోరుకోరు. సో మధ్యస్థంగా వేరే పరిష్కారం చూడాల్సి రావొచ్చు.
సో క్లాష్ ఉండకపోవచ్చనేది ఒక వెర్షన్. అయితే రెండు సినిమాల షూటింగులు ఇంకా కీలక దశలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే దీని గురించి ఎలాంటి నిర్ధారణకు రాలేం. కెరీర్ పరంగా పవన్ కు ఓజి, బాలయ్యకు అఖండ 2 చాలా ప్రెస్టీజియస్ గా రూపొందుతున్నాయి. వీటికి తమనే సంగీత దర్శకుడు కావడం కాకతాళీయం. ఒకవేళ వీటిలో ఏది దసరా మిస్ చేసుకున్నా అటుపై డిసెంబర్ లేదా జనవరికి వెళ్లాల్సి ఉంటుంది. ఎంత ప్లాన్డ్ గా ఉంటున్నా సరే రిలీజ్ డేట్లను లక్ష్యంగా పెట్టుకుని అన్నీ పూర్తి చేసుకోవడం ప్యాన్ ఇండియా దర్శకులకు సవాల్ గా మారుతోంది. అందుకే ఈ మార్పులు, డిస్కషన్లు.