
అర్ధరాత్రి ప్రీమియర్లకు వీరమల్లు సిద్ధమేనా?
పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 విడుదలకు సరిగ్గా ఇరవై మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో మళ్ళీ రిలీజ్ ఆగిపోవచ్చనే టెన్షన్ ఫ్యాన్స్ లో ఉంది కానీ సమస్య అప్పటిదాకా సాగదీయరనే ధీమా డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో కనిపిస్తోంది. ఈలోగా చర్చలు, సమీక్షలు జరిపి ఏదో ఒక పరిష్కారం తీసుకొస్తారు. దర్శకుడు జ్యోతికృష్ణ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. టైం తక్కువగా ఉండటంతో సెన్సార్ కాపీని సిద్ధం చేయించే పనిలో టీమ్ తో పగలు రాత్రి తేడా లేకుండా పని చేయిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా హరిహర వీరమల్లుకు ముందు రోజు అర్ధరాత్రే ప్రీమియర్లు వేసేలా పంపిణీదారులు సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి ఇలాగే చేశారు. మొదటి రెండు బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యాయి కూడా. అదే తరహాలో వీరమల్లుకి సైతం స్పెషల్ ప్రీమియర్లు అదనపు ధరతో వేసే ఆలోచనలో నిర్మాత ఏఎం రత్నం ఉన్నట్టు చెబుతున్నారు. అయితే దీనికి పవన్ అనుమతి తప్పనిసరి. వేరే హీరో అయితే వెంటనే ఎస్ చెప్పేవారేమో కానీ తాను హీరోగా నటించిన సినిమా కాబట్టి టికెట్ రేట్ మరీ ఎక్కువగా పెడితే ఆ పాయింట్ ని రాజకీయ ప్రత్యర్థులు వాడుకోవచ్చు.
అయినా కూడా రత్నంకు అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశాలు కొట్టిపారేయలేం. హైప్ సంగతి ఎలా ఉన్నా వీరమల్లు బృందం మాత్రం సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది. అంచనాలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూడొచ్చని ఊరిస్తున్నారు. ట్రైలర్ చూశాకే ఒక అవగాహన వస్తుందని, జూన్ 12 నాటికి సీన్ మొత్తం మారిపోతుందని అంటున్నారు. కీరవాణి పాటలు ఆడియోలో ఎలా ఉన్నా పిక్చరైజేషన్ తో పాటు చూస్తే రిపీట్స్ వేయడం ఖాయమని చెబుతున్నారు. ఒకవేళ వీరమల్లు కనక అర్ధరాత్రి ప్రీమియర్లకు కనక ఓటేస్తే ఈ మధ్య కాలంలో చూడని భారీ నెంబర్స్ నమోదు కావడం ఖాయం.