
"కన్నప్ప"లో బ్రాహ్మణులను కించపరచలేదు: ఆకెళ్ళ
రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ కన్నప్ప చిత్రంలో బ్రాహ్మణులను కించపరచలేదని ఒక బహిరంగ లేఖ ద్వారా తెలియజేశారు.
"గత కొద్ది కాలంగా విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన 'కన్నప్ప' చిత్రం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి ఆ సినిమాకి మాటల రచయితగా పనిచేసిన నా మనసుకి ఆవేదన కలిగి, కొన్ని విషయాలు మీతో చెప్పదల్చుకున్నాను.
నా పేరు ఆకెళ్ళ శివప్రసాద్, బ్రాహ్మణుడిని. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ ముకేష్ కుమార్ సింగ్ గారు కూడా ఉత్తర భారత దేశానికి చెందిన బ్రాహ్మణులు. టీవీ సీరియల్గా మహాభారతాన్ని అత్యద్భుతంగా తీసిన దర్శకులు. ఈ చిత్రంలో బ్రాహ్మణులని గానీ, ఏ ఇతర కులాల వారిని గానీ కించపరచలేదు.
అలాగే ఇదివరకు కన్నప్ప చరిత్ర మీద వచ్చిన చిత్రాలలో కన్నడ కంఠీరవ శ్రీ రాజ కుమార్ గారు నటించిన 'శ్రీ కాళహస్తి మహత్యం', శ్రీ కృష్ణంరాజు గారు నటించిన 'భక్త కన్నప్ప' చిత్రాలలో గుడిలో ప్రధాన పూజారి మహదేవ శాస్త్రి పాత్రను (మొదటి చిత్రంలో శ్రీ ముదిగొండ లింగమూర్తి గారు, రెండవ దాంట్లో శ్రీ రావు గోపాల రావు గారు పోషించారు) గుడిలో దేవుడి నగలు తీసుకెళ్ళి తన ఉంపుడుగత్తెకు ఇచ్చినట్టుగా చూపించారు. కానీ కన్నప్ప చిత్రంలో కథానాయకుడిగా నటించడమే గాక, కథా రచన చేసిన శ్రీ విష్ణు మంచు గారు... ధూర్జటి 16వ శతాబ్దంలో రచించిన శ్రీ కాళహస్తి మహత్యం గ్రంథం ఆధారంగా, శ్రీ మోహన్ బాబు గారు పోషించిన మహదేవ శాస్త్రి పాత్రని మహా శివ భక్తుడి పాత్రగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. రేపు సినిమా చూశాక, ప్రేక్షకులందరికీ ఆ విషయం అర్థమవుతుంది.
మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా, చిత్రాన్ని పూర్తి చేశాక కూడా పరమ పవిత్రమైన శ్రీ కాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకి చూపించారు. వారు చిత్రం ఎంతో ఉన్నతంగా వుందని ప్రశంసించి, శ్రీ మోహన్ బాబు గారిని, శ్రీ విష్ణు గారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
ఇక ఈ చిత్రంలో పాటని రాసిన శ్రీ రామజోగయ్య శాస్త్రి గారితో పాటు ఎందరో బ్రాహ్మణులు వివిధ శాఖలలో పనిచేసారు. ఇంకొక విషయం... ఏ వర్గం వారిని కించపరచడానికి, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలను భరించి చిత్రాన్ని నిర్మించవలసిన అవసరం ఎవరికీ లేదు. చివరగా, కన్నప్ప చిత్రం ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు"